కాటారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా–వార్పు నిరసన.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా శుక్రవారం కాటారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద వంటా–వార్పు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు పూర్తవుతున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్ను పెంచుతామని ఇచ్చిన హామీతో పాటు మహిళలకు ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మికి అదనపు బంగారం వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.

అంగన్వాడీ ఉద్యోగులు, మహిళా సంఘాలు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేశామని, ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాటారం మండల ప్రజలు ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు చైతన్యవంతులై హామీల అమలుపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న హామీ ఏమైంది?
ఫ్రీ బస్సు పథకంతో మహిళల మధ్య కొట్లాటలు జరిగే పరిస్థితి: జక్కు శ్రీహర్షిణీ రాకేష్
కాటారం: మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత బస్సు పథకం పేరుతో మహిళల మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేలా చేసిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ విమర్శించారు.
ఆమె మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఒక మహిళ ప్రభుత్వ హామీలపై ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలు కూడా తమకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేశామని ఆమె పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి బదులుగా హైడ్రా పేరుతో కూల్చివేతలు చేపట్టి పేదల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టిందని శ్రీహర్షిణీ రాకేష్ ఆరోపించారు.









Leave a Reply