3,500 మంది అభ్యర్థుల నుంచి సుమారు 300 మంది ఎంపిక.. నిరుపేదలు, ఆదివాసీ యువతకు ప్రత్యేక అవకాశం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి:
పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని సాధించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు.
3,500 మందికి పరీక్ష.. సుమారు 300 మంది ఎంపిక
ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన ఎంపిక పరీక్షకు సుమారు 3,500 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీస్ శాఖ తెలిపింది. వారిలో సుమారు 300 మందిని ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థుల్లో నిరుపేదలు, ఆదివాసీ యువతకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఉచిత శిక్షణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. కష్టపడి చదివే ప్రతి ఒక్కరికీ విజయం సాధించే అవకాశం ఉంటుందని, నిరంతర శ్రమతోనే ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించారు.
నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ
హైదరాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి నిష్ణాతులైన అధ్యాపకుల బృందంతో అభ్యర్థులకు ప్రాథమిక పరీక్షకు అవసరమైన నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
శిక్షణలో భాగంగా ప్రతిరోజూ, వారాంత పరీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థుల సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా అభ్యర్థులు ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో ఎంపిక కావాలి
ప్రతిరోజూ బోధించిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటూ, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అభ్యర్థులకు సూచించారు.
ముఖ్యంగా మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply