ఎన్నాళ్లకు గుర్తొచ్చావా వాన…!
దేవరకొండ, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడల్లా వర్షం కోసం ఎదురుచూస్తూ మూడు నెలలుగా ఆశగా చూసిన దేవరకొండ ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది.
శనివారం సాయంత్రం ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకుని… ఇక ఆగనంటూ అన్నట్టుగా దేవరకొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో వర్షాలు సరిగా లేకపోవడంతో చెరువులు, కుంటల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. మరో రెండు రోజుల్లో వినాయక చవితి వేడుకలు జరగనున్న నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి నీటి లభ్యతపై నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో శనివారం కురిసిన వర్షం వినాయక మండపాల నిర్వాహకులతో పాటు రైతుల్లోనూ సంతోషాన్ని నింపింది. వర్షంతో చెరువులు, కుంటల్లో కొంతమేర నీటి లభ్యత పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
మరోవైపు గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతూ వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే నేటి వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.
ఇక వర్షం కురుస్తుండటంతో దేవరకొండలో సరదా కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
“ఎన్నాళ్లకు గుర్తొచ్చావా వాన… చుట్టపక్కల వస్తావా? చూసి వెళ్లిపోతావా?”
“నువ్వు వస్తానంటే… నేనొద్దంటానా!”
అంటూ వర్షాన్ని ఆస్వాదిస్తూ పలువురు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి… మూడు నెలలుగా ఎదురుచూసిన వాన ఎట్టకేలకు పలకరించడంతో దేవరకొండలో వాతావరణం చల్లబడటమే కాకుండా ప్రజల ముఖాల్లోనూ ఆనందం కనిపించింది.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply