విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: హెచ్ఎం నరసింహారావు
ఉపాధ్యాయుల బోధనను సద్వినియోగం చేసుకోవాలి: సీఆర్పీ మల్లయ్య
మంథని, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంథని మండలం ఆరెంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం నరసింహారావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు అందించే విద్య, విలువలు, క్రమశిక్షణ విద్యార్థుల జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయని తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల్లో విద్యతో పాటు మంచి నడవడిక, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో చదివి పాఠశాలకు మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. విద్యార్థులు చిన్న వయసులోనే తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా నిరంతరం శ్రమించాలని సూచించారు. ప్రతిభ ఒక్కరోజులో రాదని, ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయుల సూచనలు పాటించడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జ్ఞానంతో పాటు వినయాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యాయుల బోధనను సద్వినియోగం చేసుకోవాలి
సీఆర్పీ మల్లయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. తరగతి గదిలో చెప్పిన అంశాలను ఇంటి వద్ద పునశ్చరణ చేసుకుంటూ, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు.
విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని, వారి సూచనలు పాటిస్తూ కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శ్రీలత సన్మానం
ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన శ్రీలత విద్యార్థుల విద్యాభ్యాసంపై చూపిన ప్రత్యేక శ్రద్ధను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఆమెకు లభించిన 27 రోజుల సెలవుల్లో 16 రోజులు పాఠశాలకు హాజరై విద్యార్థులకు బోధన అందించినందుకు గుర్తింపుగా ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానించారు.
అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని చాటుకుంటూ వారిని ఘనంగా సన్మానించారు. ప్రేమతో తీసుకొచ్చిన చిరు కానుకలను అందజేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలపై పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు సువార్త, మమత, పద్మజ, ఎం.డి. గియాసుద్దీన్, శ్రీవాణి, శ్రీలత, సహేందర్, అమన్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply