హాలియా విద్యార్థుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు
హాలియా, ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
సత్య స్పోర్ట్స్ కరాటే-డూ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న మాస్టర్లు, విద్యార్థులు చెన్నై వేదికగా ఇటీవల నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక అటెంప్ట్ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములై గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం హాలియా ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ గుంటోజు హరికుమార్ బ్లాక్ బెల్ట్ 2వ డాన్తో పాటు రెండోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా నిలిచారు. మద్దెల నరేష్ బ్లాక్ బెల్ట్ 1వ డాన్తో తొలిసారి గిన్నిస్ రికార్డ్ సాధించారు. జూనియర్ మాస్టర్ తంగేళ్ల వర్షిత్ రాజు బ్రౌన్ బెల్ట్ 1వ క్యూ విభాగంలో రెండుసార్లు గిన్నిస్ రికార్డు సాధించారు.
అదేవిధంగా బ్లూ బెల్ట్ విద్యార్థులు గుడిపాటి యోగిశ్వర్, ఎస్.కె. మెహరున్నిసా, వీరమల్ల సహస్ర, మందారపు సాయి యశ్వంత్, గ్రీన్ బెల్ట్ విద్యార్థులు సూరే జోషిత, గుంటోజు రుత్విక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని రికార్డు సాధించడంలో భాగస్వాములయ్యారు.
ప్రత్యేక శిక్షణతో చెన్నైకి
హాలియాలోని ఆకాంక్ష విద్యాసంస్థలు, హాలియా పబ్లిక్ స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం కోసం సత్య స్పోర్ట్స్ కరాటే-డూ అకాడమీ ప్రత్యేక శిక్షణ, ప్రాక్టీస్ అందించింది. అనంతరం విద్యార్థులను చెన్నైకి తీసుకెళ్లి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనేలా చేయడంలో అకాడమీ కీలక పాత్ర పోషించింది.

విద్యార్థుల క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలల యాజమాన్యాల సహకారం ఈ విజయానికి ప్రధాన కారణమని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. హాలియా నుంచి చెన్నై వరకు విద్యార్థులను తీసుకెళ్లి ప్రతిష్టాత్మక రికార్డు కార్యక్రమంలో పాల్గొనేలా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
విద్యార్థులను అభినందించిన అకాడమీ డైరెక్టర్
ఈ సందర్భంగా సత్య స్పోర్ట్స్ కరాటే-డూ అకాడమీ ఆఫ్ ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ తంగేళ్ల సత్యనారాయణ రాజు, బ్లాక్ బెల్ట్ 6వ డాన్, 6 టైమ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, హై రేంజ్ వరల్డ్ రికార్డ్, బోధి వరల్డ్ రికార్డ్ హోల్డర్, KIO కోచ్, విద్యార్థుల కృషి, పట్టుదల, శ్రమపై హర్షం వ్యక్తం చేసి వారిని అభినందించారు.

అకాడమీ అసిస్టెంట్ మాస్టర్లు గుంటోజు హరికుమార్, మద్దెల నరేష్ మాట్లాడుతూ అకాడమీ విద్యార్థుల నైపుణ్యాన్ని, మాస్టర్ల కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తే హాలియా ప్రాంతానికి మరింత మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
కరాటేతో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రతిభ
సత్య స్పోర్ట్స్ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు కరాటేతో పాటు వివిధ క్రీడల్లోనూ రాణిస్తున్నారు. కంచర్ల రిత్విక్ రెడ్డి, బ్రౌన్ బెల్ట్, స్పోర్ట్స్ స్కూల్లో స్టేట్ 5వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ 2వ ర్యాంక్ సాధించి, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఆర్చరీ, జిమ్నాస్టిక్స్లో శిక్షణ పొందుతున్నాడు.
అదేవిధంగా ఇదే నెలలో అథ్లెటిక్స్ రన్నింగ్ విభాగంలో వేద, ఆరెంజ్ బెల్ట్ విద్యార్థిని, స్టేట్ 2వ ర్యాంక్ సాధించడం కూడా అకాడమీకి గర్వకారణంగా నిలిచింది. కరాటే ద్వారా తమలో పెరిగిన క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం ఇతర క్రీడల్లోనూ విజయాలు సాధించేందుకు ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపారు.
హాలియాను స్పోర్ట్స్ ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
“హాలియా ప్రాంతాన్ని ఒక స్పోర్ట్స్ ప్రాంతంగా తీర్చిదిద్దాలి. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి” అనే లక్ష్యంతో సత్య స్పోర్ట్స్ కరాటే-డూ అకాడమీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసినట్లు ఫౌండర్ & డైరెక్టర్ తంగేళ్ల సత్యనారాయణ రాజు తెలిపారు.
భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించి, హాలియా ప్రాంతం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే తమ అకాడమీ లక్ష్యమని ఆయన తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply