నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో 50వ వర్ధంతి కార్యక్రమం
తండ్రి జ్ఞాపకాలను 50 ఏళ్లుగా కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులు
దేవరకొండ ప్రతినిధి | సెప్టెంబర్ 9 | అయుష్ 24 న్యూస్
“నాన్న.. నీవు భౌతికంగా దూరమైనా మా హృదయాల్లో చిరస్థాయిగా ఉంటావు. నీవిచ్చిన ఈ జన్మ రుణాన్ని ఎన్ని జన్మలైనా తీర్చుకోలేం” అంటూ కీర్తిశేషులు పగిడిమర్రి మల్లయ్య (మల్లప్ప) కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
దేవరకొండ పట్టణానికి చెందిన పగిడిమర్రి మల్లయ్య (మల్లప్ప) 50వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, బంధువులు, స్నేహితులు కలిసి బుధవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
సాధారణంగా వర్ధంతి కార్యక్రమాలు కుటుంబ సభ్యుల మధ్య పరిమితమవుతుండగా.. మల్లయ్య కుటుంబ సభ్యులు మాత్రం గత 50 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేద బ్రాహ్మణులను ఆహ్వానించి పూజలు నిర్వహించడం, దానధర్మాలు చేయడం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ తండ్రి జ్ఞాపకాలను తరతరాలకు అందిస్తున్నారు.
ఎనిమిది మంది సంతానాన్ని తీర్చిదిద్దిన తండ్రి
పగిడిమర్రి మల్లయ్య తన ఎనిమిది మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసి, వారికి విద్యతో పాటు మంచి విలువలు, సంస్కారం, సంప్రదాయాలను నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.

ఆయన మరణించి ఐదు దశాబ్దాలు గడిచినా.. ఆయన చూపిన మార్గంలోనే కుటుంబ సభ్యులు నడుస్తూ ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్నారని తెలిపారు.
పగిడిమర్రి గురునాథం, పగిడిమర్రి విశ్వం నేతృత్వంలో నిర్వహించిన “నాన్న యాదిలో” కార్యక్రమం కుటుంబ సభ్యులందరినీ ఒక్కచోట చేర్చింది. సుమారు 150 మంది కుటుంబ సభ్యులు పాల్గొనడంతో కార్యక్రమం కుటుంబ ఆత్మీయ సమ్మేళనంగా మారింది.
“పితృదేవతలే ప్రత్యక్ష దైవాలు”
తల్లిదండ్రులను గౌరవించడం, వారి జ్ఞాపకాలను తరతరాలకు అందించడం భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన విలువ అని కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, కుటుంబ విలువలను భవిష్యత్ తరాలకు అందించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పిందని అభిప్రాయపడ్డారు.
ప్రజాసేవకు అంకితమైన మల్లప్ప
కీర్తిశేషులు పగిడిమర్రి మల్లయ్య (మల్లప్ప)ను స్మరించుకున్న పలువురు స్నేహితులు, బంధువులు ఆయన ప్రజాసేవను కొనియాడారు.
పేదలు, అణగారిన వర్గాల పట్ల ఆయనకు ఉన్న మమకారం, ప్రజల సమస్యలపై స్పందించే తత్వం, సేవా భావం ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయని తెలిపారు. తన ఇంటిని సైతం అవసరమైన వారికి అండగా నిలిచే వేదికగా మార్చారని గుర్తుచేసుకున్నారు.
ఆ రోజుల్లో పట్వారీ వ్యవస్థ నేపథ్యంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ, కమ్యూనిస్టు భావజాలంతో ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యమైన మల్లప్ప.. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిగా నిలిచారని పలువురు పేర్కొన్నారు.
దేవరకొండ గాంధీగా పేరొందిన మునగాల కొండలరావుతో ఆయనకు ఉన్న స్నేహం, అలాగే పల్లా పర్వతరెడ్డి ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్రను పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
“మల్లప్పలాంటి వ్యక్తులు అరుదు”
కార్యక్రమంలో పాల్గొన్న లయన్ సముద్రాల ధనంజయ, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి తదితరులు మల్లప్పతో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన జ్ఞాపకాలను పంచుకున్నారు.
మల్లప్పలాంటి వ్యక్తులు నేటి సమాజంలో అరుదుగా కనిపిస్తారని వారు పేర్కొన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
లయన్ సముద్రాల ధనంజయ మాట్లాడుతూ.. ఎంతోమంది పుడుతూ, జీవిస్తూ, వెళ్లిపోతుంటారని, కానీ పగిడిమర్రి మల్లయ్యలాంటి వ్యక్తులు తరతరాలకు గుర్తుండిపోతారని భావోద్వేగంతో పేర్కొన్నారు.
“నాన్న ఆశీస్సులే మా కుటుంబానికి బలం”
తండ్రి మల్లయ్య ఆశీస్సులే తన జీవితానికి, కుటుంబ అభివృద్ధికి ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తండ్రి తనకు ఇచ్చిన జన్మ, జీవితం ఆయన ప్రసాదించిన వరమని, తండ్రి జ్ఞాపకాలను జీవితాంతం గుండెల్లో పదిలంగా ఉంచుకుంటానని తెలిపారు.
తరతరాలకు ఆదర్శంగా “నాన్న యాదిలో”
నేడు పగిడిమర్రి మల్లయ్య కుటుంబం సుమారు 150 మంది కుటుంబ సభ్యులతో పెద్ద కుటుంబంగా విస్తరించింది. మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లతో కలిసి కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
ఐదు దశాబ్దాలుగా తండ్రి వర్ధంతిని మరచిపోకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ, ఆయన ఆశయాలు, విలువలు, సేవా భావాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్న కుటుంబ సభ్యుల తీరును పలువురు అభినందించారు.
“నాన్న నీవు భౌతికంగా దూరమైనా.. మా హృదయాల్లో చిరస్థాయిగా ఉంటావు” అనే సందేశంతో సాగిన ఈ 50వ వర్ధంతి కార్యక్రమం కుటుంబ అనుబంధానికి, తల్లిదండ్రుల పట్ల గౌరవానికి ప్రతీకగా నిలిచింది.



Musini.Anjan





Leave a Reply