వెంకటాపూర్–ఆరెంద రహదారి విస్తరణ పనులను వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలి
ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు వచ్చేలా బోధించాలి
విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
అయుష్ 24 న్యూస్ | మంథని, సెప్టెంబర్ 9:
మంథని మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
బుధవారం మంథని మండలంలోని ఖాన్సాయిపేట ఎంపీపీఎస్, భట్టుపల్లి ఎంపీపీఎస్, అంగన్వాడీ కేంద్రం, వెంకటాపూర్ ఎంపీపీఎస్, మల్లారం ఎంపీపీఎస్, ఆరెంద జెడ్పీహెచ్ఎస్, స్వర్ణపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, విద్యాబోధన, అభ్యసన స్థాయిపై అధికారులు, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వెంకటాపూర్–ఆరెంద రహదారి పనులు ప్రారంభించాలి
మంథని మండలంలోని వెంకటాపూర్ నుంచి ఆరెంద వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుత రహదారిపై ఏర్పడిన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ఖాన్సాయిపేట ఎంపీపీఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెంకటాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మంజూరైన అదనపు తరగతి గది నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు.
మిగిలిన పాఠశాలల్లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలని తెలిపారు.
ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఎఫ్ఎల్ఎన్ (Foundational Literacy and Numeracy) కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థికి కనీసం చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు వచ్చేలా బోధన అందించాలని ఆదేశించారు.
విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా దృష్టి పెట్టాలని తెలిపారు.
విద్యార్థుల హాజరుపై నిరంతర పర్యవేక్షణ
విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదించి, గైర్హాజరుకు కారణాలను తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి పాఠశాలలో నెలకు ఒకసారి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రులకు వివరించి వారి సహకారం తీసుకోవాలని సూచించారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యా నైపుణ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపీవో షబ్బీర్ పాషా, ఏఈ పి.ఆర్. జగదీశ్, సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply