ఉత్తమ ఉపాధ్యాయులకు దళిత ప్రజా సంఘాల ఘన సన్మానం
మంథని, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు సీహెచ్. పోచయ్య, బహుత్ కిషోర్లను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మంథని బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్. పోచయ్య, బోయినపేట (తెలుగుగూడెం) ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న బహుత్ కిషోర్లను మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్లో శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వకారణమని అన్నారు. ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలకు లభించిన గుర్తింపుగా ఈ పురస్కారాలను భావించాలని పేర్కొన్నారు. అవార్డులతో ఉపాధ్యాయులపై బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను అందిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.
విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఉపాధ్యాయుల నిజమైన విజయమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
సన్మానానికి స్పందించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమకు లభించిన అవార్డుతో పాటు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సన్మానం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. తమ సేవలను గుర్తించి గౌరవించడం ఆనందంగా ఉందని, ఈ ప్రోత్సాహం విద్యార్థుల కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల గట్టయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మంథని లక్ష్మణ్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్ కుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం మంథని మండల అధ్యక్షుడు కర్ణ కృష్ణ, దళిత నాయకులు కాసిపేట వెంకటస్వామి, కనుకుట్ల స్వామి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply