- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, ఆగస్టు 18 — అయుష్ 24 న్యూస్:దేవరకొండ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, పనులు పూర్తిచేయడంలో ఎదురవుతున్న సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు.దేవరకొండ నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. సాగునీటి లభ్యత పెరగడంతో ప్రస్తుతం వర్షాధారంగా సాగు చేస్తున్న అనేక ప్రాంతాలకు భరోసా ఏర్పడుతుందని, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులు వివిధ పంటలను సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు మరింత సమృద్ధి చెందే అవకాశం ఉందని, తద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తే రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తోందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని అన్నారు.దేవరకొండ నియోజకవర్గ రైతుల చిరకాల సాగునీటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయి సాగునీరు అందుబాటులోకి వస్తే దేవరకొండ నియోజకవర్గం వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని, రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల పనులకు అవసరమైన అనుమతులు, నిధులు, ఇతర పరిపాలనా చర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే బాలు నాయక్ కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.










Leave a Reply