మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు మహిళలే తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ‘వంటా వార్పు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని, మహిళలకు స్కూటీలు ఇస్తామని ప్రకటించి పట్టించుకోలేదని, కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆయన ఆరోపించారు.
మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మహిళల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రమావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
“ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










Leave a Reply