ఆయిల్ పామ్ రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటాం: పతంజలి ప్రతినిధులు
కొండమల్లేపల్లి, ఆగస్టు 20, అయుష్ 24 న్యూస్: ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మరింత చేరువగా ఉండడంతో పాటు, సాగును విస్తృతంగా ప్రోత్సహించి రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ (ఆయిల్ పామ్ విభాగం) కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని కొండమల్లేపల్లిలో ప్రారంభించింది.
కొండమల్లేపల్లిలోని విష్ణు కాంప్లెక్స్లోని షాప్ నంబర్ 94లో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ నాయిని జమునా మాధవ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పతంజలి డీజీఎం యాదగిరి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు వివిధ రకాల సబ్సిడీలను అందిస్తోందని తెలిపారు. రైతులు ఎకరాకు 57 ఆయిల్ పామ్ మొక్కలు నాటాల్సి ఉంటుందని, సబ్సిడీపై ఒక్కో మొక్క రూ.20కే లభిస్తుందని వివరించారు.
బిందు సేద్యం పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఓసీ రైతులకు 70 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు ఎకరాకు రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు.
రైతులకు ప్రత్యేక సేవా కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం
పతంజలి జిల్లా మేనేజర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ రైతులకు నిరంతరం మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందించేందుకు ఈ ప్రాంతీయ కార్యాలయం ప్రత్యేక కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. రైతులు తమ సందేహాలు, సాగుకు సంబంధించిన సమస్యలను కార్యాలయం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించి రైతులకు స్థిరమైన ఆదాయ అవకాశాలు కల్పించేందుకు పతంజలి సంస్థ రైతులకు అందుబాటులో ఉంటుందని ప్రతినిధులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పతంజలి డీజీఎం యాదగిరి, మేనేజర్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాయిని జమునా మాధవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాసర్ల వెంకటయ్య, మాజీ అధ్యక్షుడు వేమన్ రెడ్డి, పతంజలి అధికారులు వంశీ, ప్రకాష్, శేఖర్, స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply