క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, పెద్దపల్లి, సెప్టెంబర్ 08:
2025–26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైస్ మిల్లర్లను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీ, డిఫాల్ట్ రైస్ మిల్లర్లు, బకాయిల చెల్లింపులు, గోదాముల లభ్యత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా సీఎంఆర్ డెలివరీ పూర్తయ్యేలా మిల్లర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు
జిల్లాలో డిఫాల్ట్గా ఉన్న రైస్ మిల్లర్లు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బకాయిలను పూర్తిగా చెల్లించిన రైస్ మిల్లర్లకు తదుపరి సీజన్లో ధాన్యం అలాట్మెంట్ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మిల్లర్లు తమ బకాయిలను సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గోదాములు
వానాకాలం ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములను ముందుగానే గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల అనంతరం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ గోదాములను అనుమతి లేకుండా ఎవరికీ కేటాయించరాదని స్పష్టం చేశారు.
గోదాముల లభ్యత, నిల్వ సామర్థ్యం, వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ, ధాన్యం నిల్వ, గోదాముల నిర్వహణ తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply