5 పడకల నుంచి 10 పడకలకు డయాలసిస్ కేంద్రం విస్తరణ.. సదరం క్యాంపు, అంబులెన్స్ ప్రారంభం
త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 1 | అయుష్ 24 న్యూస్
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా దేవరకొండ నియోజకవర్గంలో వైద్య, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు.

గతంలో 5 పడకల సామర్థ్యంతో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని 10 పడకలకు విస్తరించి, ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేవరకొండలోనే సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
దేవరకొండలోనే సదరం సేవలు
దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం నల్లగొండకు వెళ్లాల్సిన ఇబ్బందులను తొలగిస్తూ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారానికి రెండు రోజులు సదరం క్యాంపులు నిర్వహించే ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో సమయం, ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

అంబులెన్స్ సేవలు ప్రారంభం
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర రోగుల కోసం ఆర్టీఏ ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని బాలు నాయక్ అన్నారు.
త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్
వాహనాల రిజిస్ట్రేషన్ తదితర సేవల కోసం ప్రజలు మిర్యాలగూడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా త్వరలో దేవరకొండలోనే వాహన రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందన్నారు.

కొత్త మండలాల్లో ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందేలా ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో వైద్యం, విద్య, సాగునీరు, రహదారులు, తాగునీరు, ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బాలు నాయక్ స్పష్టం చేశారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply