Breaking News
దేవరకొండ నియోజకవర్గంలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

దేవరకొండ, జూలై 24 (అయుష్ 24 న్యూస్): ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి పిలుపు మేరకు, నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎస్‌యూఐ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పానుగంటి శ్రీకాంత్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడేలా నీట్ పరీక్ష పేపర్ లీక్ వంటి ఘటనలు జరగడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు.

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు అమలు చేయాలని కోరారు. అలాగే, ఈ అంశంపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రేకులగడ్డ సర్పంచ్ ఎలుక జలేందర్ గౌడ్, దేవరకొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతకుంట్ల రాకేష్, ఎన్నిమల్ల రమేష్, కొర్ర నాగరాజ్ నాయక్, యేకుల అంబేద్కర్, రామావత్ వంశీ, పార్థసారథి, రాజీవ్, శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

– అయుష్ 24 న్యూస్
“నిజం కోసం… ప్రజల గొంతుక”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *