యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో ముందుకు సాగాలి: న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్
షాద్నగర్ | అయుష్ 24 న్యూస్
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, యువతలో దేశభక్తి భావనను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నేటి యువతలో కొందరు చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసలుగా మారుతూ తమ బాధ్యతలను మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు.
ముఖ్యంగా మహిళలు, బాలికల భద్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఏర్పడినప్పుడే సమాజంలో నిజమైన స్వాతంత్ర్య భావన బలపడుతుందని పేర్కొన్నారు.

మహిళలు, బాలికలు తమ ఆత్మరక్షణ కోసం కుంగ్ ఫు, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యలను నేర్చుకోవాలని మాస్టర్ అహ్మద్ ఖాన్ సూచించారు. ఆత్మరక్షణ విద్యల ద్వారా ఆపద సమయంలో తమను తాము కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందుతాయని తెలిపారు.
కుంగ్ ఫు, కరాటే వంటి క్రీడల వల్ల శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్తో పాటు ఇతర క్రీడలు, విద్యలను అభ్యసిస్తూ తమను తాము అభివృద్ధి చేసుకోవాలని, సమాజానికి మరియు దేశానికి మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ తరఫున 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply