ఆలయ అభివృద్ధి పనులపై సంతృప్తి.. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
ధర్మపురి, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. పనులు ముందుకు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఢిల్లీలో కార్యక్రమాలు ఉండటంతో గతంలో ధర్మపురికి రాలేకపోయానని, అందుకే ప్రస్తుతం తిరిగి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు ఎంపీ తెలిపారు.
గత పదేళ్లలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు కోటిలింగాల ఆలయానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ‘శుద్ధీకరణ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం దళితులను కించపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటన బీజేపీ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు.

‘జై శ్రీరామ్’ పేరుతో ఓట్లు అడిగిన బీజేపీ ఆలయాల అభివృద్ధికి మాత్రం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఎంపీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మపురిలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply