మద్యం అమ్ముతున్నట్టు సమాచారం ఇస్తే రూ.5 వేల పారితోషకం: సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి
మంథని, ఆగస్టు 17: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం విధిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించడంతో పాటు, మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందించిన వారికి రూ.5 వేల పారితోషకం అందిస్తామని గ్రామ సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.
గ్రామపంచాయతీ పాలకవర్గం చేసిన మద్యపాన నిషేధ తీర్మాన కాపీలను సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులు మంథని ఎస్సై సందీప్ కుమార్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ప్రస్తుతం ఆరు బెల్ట్ షాపులు ఉన్నాయని, వాటి కారణంగా యువతతో పాటు గ్రామ ప్రజలు మద్యానికి బానిసై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మద్యం కారణంగా కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని, కొంతమంది యువకులు భార్యలు, తల్లిదండ్రులను వేధించడం, కొట్టడం వంటి ఘటనలకు పాల్పడుతూ పెడదారి పడుతున్నారని తెలిపారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామ సభలో ప్రజల సమక్షంలో మద్యపాన నిషేధంపై చర్చించి, గ్రామంలో పూర్తిస్థాయిలో మద్యం విక్రయాలను అరికట్టాలని నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు.
గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.50,000 జరిమానా విధిస్తామని, మద్యం విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికి లేదా గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి సమాచారం అందించిన వారికి రూ.5,000 పారితోషకం అందిస్తామని వెల్లడించారు.
గ్రామ సర్పంచ్, పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఎరుకల లలిత, వార్డు సభ్యులు బూడిద తిరుపతి, ఎరుకల రాజశేఖర్, దాసరి రవీందర్, బూడిద శ్రీకాంత్, జక్కుల భాగ్యలక్ష్మి, తోకల శైలజ, అనసూయ, సత్తమ్మ, గ్రామ వీవో అధ్యక్షురాలు ఎరుకల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply