నాగార్జున సాగర్కు నీరు విడుదల చేయాలి.. ఏఎంఆర్పీ నీటితో స్థానిక చెరువులు, కుంటలు నింపాలి: మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ, ఆగస్టు 21 — అయుష్ 24 న్యూస్:
నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు. నాగార్జున సాగర్కు నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం పీఏ పల్లి మండలం గణపురం స్టేజ్ సమీపంలోని ఏఎంఆర్పీ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మెయిన్ గేట్ల వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సుమారు 25 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తున్న సమయంలో నాగార్జున సాగర్కు నీరు రాకుండా అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయిలో నిండే వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాలతో నీటిని తరలిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.
ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి సమృద్ధిగా నీరు వస్తున్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రవీంద్ర కుమార్ విమర్శించారు. నాగార్జున సాగర్లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు జిల్లా మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు.
స్థానిక చెరువులు, కుంటలను ముందుగా నింపాలి
ఏఎంఆర్పీ రిజర్వాయర్ నీటిని ముందుగా గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలకు అందించి నింపాలని రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులు ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని తెలిపారు.
భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు, పశువులకు కూడా తాగునీటి సమస్య ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ పట్టణానికి తాగునీరు అందించే క్రమంలో నీటిని తరలించడంతో పాటు గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలను తప్పనిసరిగా నింపాలని స్పష్టం చేశారు.
“చెరువులు, కుంటలు నింపాలి.. స్థానిక రైతాంగాన్ని, ప్రజలను కాపాడాలి” అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఏఎంఆర్పీ రిజర్వాయర్ నీటిని సమర్థవంతంగా వినియోగించి రైతులకు సాగునీటి భరోసా కల్పించడంతో పాటు ప్రజలు, పశువులకు తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని రవీంద్ర కుమార్ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.
“స్థానిక ఎమ్మెల్యేకు నల్లమట్టి మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. నల్లగొండకు నీటిని తరలిస్తున్నప్పటికీ స్థానిక రైతుల సాగునీటి అవసరాలపై ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం వెంటనే నీటి విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సాగునీరు అందించాలని, ఏఎంఆర్పీ నీటితో గుడిపల్లి, పీఏ పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలను నింపాలని రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కటికనేని మాధవరావు, తోటకూరి పరమేష్, మద సుధాకర్ గౌడ్, సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, నగేష్, రమావత్ కిషన్, అర్వపల్లి నర్సింహ, బొడ్డుపల్లి మహేందర్, దీపావత్ నరేందర్, ఎర్ర యాదగిరి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply