భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు
దేవరకొండ, సెప్టెంబర్ 6 — అయుష్ 24 న్యూస్:
దేవరకొండ నియోజకవర్గం నేరేడుగొమ్ము మండలంలోని వడ్డెర బస్తీలో ఈదమ్మ తల్లి బోనాల వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈదమ్మ తల్లి బోనాల సందర్భంగా వడ్డెర బస్తీకి చెందిన మహిళలు ఉపవాస దీక్షలతో బోనాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అనంతరం బోనాలతో కాలనీ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఈదమ్మ తల్లికి సమర్పించారు. యువకుల నృత్యాలు, డీజే పాటలతో బోనాల ఊరేగింపు ఉత్సాహభరితంగా సాగింది.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ మాట్లాడుతూ.. ఈదమ్మ తల్లి ఆశీస్సులతో నేరేడుగొమ్ము ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈదమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నామని తెలిపారు.
వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి మల్లు సూచనల మేరకు కులబాంధవులంతా ఐక్యంగా కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని ఇరగదిండ్ల కృష్ణ తెలిపారు.
నేరేడుగొమ్ము మండల వడ్డెర సంఘం అధ్యక్షుడు వరికుప్పల రాములు మాట్లాడుతూ.. ఈదమ్మ తల్లి తమ కులదైవమని, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ప్రతి సంవత్సరం బోనాల వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఇరగదిండ్ల వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.
వడ్డెర యువజన సంఘం అధ్యక్షుడు ఇరగదిండ్ల బాలరాజు మాట్లాడుతూ.. వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకోగా, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, భక్తులు కలిసి బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ, నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు వరికుప్పల రాములు, ఇరగదిండ్ల వెంకటేష్, యువజన సంఘం అధ్యక్షుడు ఇరగదిండ్ల బాలరాజు, వరికుప్పల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply