టీజీడబ్ల్యూఐడీసీ ఎండీ ఇందుర్తి గణపతి రెడ్డిని కోరిన పడమటపల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి
దేవరకొండ, సెప్టెంబర్ 7 – అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: దేవరకొండ మండలంలోని మహబూబ్నగర్ రూట్లో ఉన్న పడమటపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని పడమటపల్లి సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి కోరారు.
గ్రామ పరిధిలో వాహనాలు అధిక వేగంతో రాకపోకలు సాగిస్తుండటంతో రహదారి దాటే సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో పలువురు ప్రమాదాలకు గురై గాయపడిన సందర్భాలతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని సర్పంచ్ తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే పలుమార్లు జాతీయ రహదారి సంబంధిత అధికారులకు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే పోలీసు అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
వేగ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి
సోమవారం పడమటపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరైన టీజీడబ్ల్యూఐడీసీ ఎండీ, రాష్ట్ర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డెవలప్మెంట్ అధికారి ఇందుర్తి గణపతి రెడ్డిని సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు.
గ్రామంలోని ఇద్దంపల్లి గేటు వైపు నుంచి వచ్చే మార్గంలో కోఆపరేటివ్ బ్యాంక్ సమీపంలో, అలాగే దేవరకొండ వైపు వెళ్లే రహదారిలో శివాలయం సమీపంలో వాహనాల వేగాన్ని నియంత్రించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేదా ఇతర అవసరమైన వేగ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.
జాతీయ రహదారి అధికారులతో మాట్లాడతానని హామీ
సర్పంచ్ విజ్ఞప్తిపై ఇందుర్తి గణపతి రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ రహదారి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన వేగ నియంత్రణ చర్యలు చేపట్టేలా మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రామ ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్న సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply