మెదక్ జిల్లా, ఆగస్టు 17: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మెదక్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఇండస్ట్రీ కనెక్ట్ పోర్టల్ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా పరిశ్రమలను, విద్యార్థులను అనుసంధానం చేసే విధంగా ఈ పోర్టల్ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మెదక్ ప్రాంతంలో సుమారు వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని, వాటికి నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఉందన్నారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేపట్టిన ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు.
మన ప్రాంతంతో పాటు దేశంలోనూ నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగులను, స్కిల్డ్ లేబర్ను అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టామ్కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి నిర్వహించిన సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఆయా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని మంత్రి వివరించారు.

విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందిస్తూ లక్షల రూపాయల వేతనాలు పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ రంగంపైనే దృష్టి సారించకుండా, ఇతర రంగాల్లోనూ మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని గుర్తించాలని సూచించారు.
సింగరేణి ప్రాంతంలోని మందమర్రిలో జర్మన్ భాషలో శిక్షణ పొందుతున్న కొంతమంది విద్యార్థులు ఇప్పటికే బి2 స్థాయి సాధించారని మంత్రి తెలిపారు. వారికి సుమారు రూ.25 లక్షల వరకు వేతనాలతో ఉద్యోగ అవకాశాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వీసా ఖర్చుల్లో సగం వరకు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా అనేక కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకుని అందుబాటులో ఉన్న వివిధ రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply