- కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు
- రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్, కత్తి, సెల్ఫోన్లు స్వాధీనం — ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అదుపులోకి
దేవరకొండ, ఆగస్టు 19 — అయుష్ 24 న్యూస్:కొండమల్లేపల్లి మండలంలో సంచలనం సృష్టించిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. దోపిడీ కోసం పథకం ప్రకారం హత్యకు పాల్పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి క్రైమ్ నంబర్ 150/2026, సెక్షన్ 103 BNS, కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు కొనసాగింది.
‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన మిస్టరీ
ఆగస్టు 11న ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెంటనే దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్ప్రింట్లు, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు తదితర అంశాలపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. మొత్తం ఐదు బృందాల్లో సుమారు 40 మంది పోలీసులు పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరిగా “బాబు” అని పలికినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఒక్క మాట దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. పాఠశాలలో రూపారెడ్డి విద్యార్థులను సాధారణంగా “బాబు” అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు.పాఠశాలకు వరుసగా ఆరు రోజులు సెలవులు ఉండటంతో విద్యార్థుల విచారణలో కొంత ఆలస్యం జరిగింది. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఒక్కొక్కరినీ విచారిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అదుపులోకి
పాఠశాలకు రెండు రోజులుగా హాజరు కాని కొంతమంది విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిలో కొత్తగా జల్సాలకు అలవాటు పడినట్లు గుర్తించిన కొంతమంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు.సీసీ కెమెరా ఫుటేజీలను అనుమానిత విద్యార్థుల కదలికలతో సరిపోల్చిన పోలీసులు, నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం ఉదయం 11:30 గంటల సమయంలో పెండ్లిపాకల “ఎక్స్” రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులను దొనియాల ఎక్స్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.వారిని విచారించి తనిఖీ చేయగా లోదుస్తుల్లో నగదు దాచుకున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అనంతరం నగదును అపహరించినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
చట్టంతో సంఘర్షణ పడిన బాలురు
JCL-1: 16 సంవత్సరాలు, పదో తరగతి విద్యార్థి, నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్, పుల్సింగ్ తండా.
JCL-2: 16 సంవత్సరాలు, పదో తరగతి విద్యార్థి, నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్, పిల్యతండ.
ఇద్దరూ ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతూ హాస్టల్లో ఒకే గదిలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో హత్యపై అన్వేషణ
పోలీసుల ప్రకారం, ఇద్దరు విద్యార్థులు జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి, తల్లిదండ్రులకు తెలియకుండా సెల్ఫోన్లు వినియోగించేవారు. సోషల్ మీడియా, యూట్యూబ్లో సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించేవారని దర్యాప్తులో వెల్లడైంది.గత నెలలో హాస్టల్లో డబ్బుతో పట్టుబడిన సమయంలో ప్రిన్సిపల్ వారిని తల్లిదండ్రుల సమక్షంలో మందలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ప్రిన్సిపల్పై కక్ష పెంచుకున్నారని, రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి హత్యకు పథకం రూపొందించినట్లు వెల్లడించారు.హత్యకు ముందు వారం రోజుల పాటు ప్రిన్సిపల్ కదలికలను గమనిస్తూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆధారాలు దొరకకుండా హత్య చేయడం గురించి అన్వేషించినట్లు పేర్కొన్నారు
పథకం ప్రకారం హత్య
పోలీసుల వివరాల ప్రకారం, మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటలకు పాఠశాల నుంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు బ్యాగులో నుంచి ఎరుపు రంగు హుడీ టీషర్ట్, ప్యాంట్ తీసుకుని వచ్చారు. అనంతరం కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు.రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని ఒకరు బయట ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తుండగా, మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. తెరిచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అనంతరం బెడ్రూమ్లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకుని ఇంటి వెనుక గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ఫోన్ను చెట్ల పొదల్లో పడేసి, కొంత దూరంలో బట్టలు మార్చుకుని ఎరుపు రంగు హుడీని డ్రైనేజీలో వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
- పోలీసులు నిందితుల నుంచి:రూ.1.54 లక్షల నగదుమృతురాలి ఐఫోన్హత్యకు ఉపయోగించిన కత్తిచేతి గ్లౌజులుమాస్కులురెండు సెల్ఫోన్లుస్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసు బృందాలకు ఎస్పీ అభినందనలుకేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన దేవరకొండ డీఎస్పీ M.V. శ్రీనివాసరావు, మల్లెపల్లి సీఐ A. నవీన్ కుమార్, CCS ఇన్స్పెక్టర్ M. జితేందర్ రెడ్డి, మల్లెపల్లి ఎస్ఐ A. రమేష్, చింతపల్లి ఎస్ఐ M. రామ్మూర్తి, గుడిపల్లి ఎస్ఐ D. నరసింహులు, గుర్రంపొడు ఎస్ఐ N. వెంకన్న, CCS ఎస్ఐ U. సురేష్తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు.ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ కేసులో లభించిన ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాల కృషి అభినందనీయమన్నారు. నేరస్థులు ఎంత తెలివిగా వ్యవహరించినా శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో దర్యాప్తు చేస్తే నేరాలను ఛేదించవచ్చని తెలిపారు.










Leave a Reply