ప్రాంతీయ సమస్యలపై అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు
మంత్రి శ్రీధర్బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం: మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం
ముత్తారం, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధు కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం ముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, ముత్తారం మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ అభ్యర్థి నూనేటి కృష్ణ మాట్లాడారు.
ఈ సందర్భంగా చొప్పరి సదానందం మాట్లాడుతూ.. ఇటీవల బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం, రైతు నిరసన కార్యక్రమంలో పుట్ట మధు చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రాంతీయ సమస్యలపై ఉన్న అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.
మండలంలో బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేయడాన్ని మాత్రం సహించబోమని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంతెన నాసిరకం పనుల కారణంగానే కూలిపోయిందని, దీనిపై విచారణ కొనసాగుతోందని సదానందం పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితులకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన హామీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ముత్తారం మండలంలో విద్యుత్ సమస్యపై కూడా బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సదానందం విమర్శించారు. నెల మొత్తం మీద విద్యుత్ సరఫరాకు 3 గంటల 51 నిమిషాల అంతరాయం మాత్రమే ఏర్పడిందని, ఇందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించిన సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని సూచించారు.
రవీందర్రావు అవకాశవాద రాజకీయాలు: నూనేటి కృష్ణ
కాంగ్రెస్ నాయకుడు నూనేటి కృష్ణ మాట్లాడుతూ.. మాజీ ఎంపీటీసీ సుధాటి రవీందర్రావు వ్యవహరిస్తున్న తీరు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో బీఆర్ఎస్ గుర్తింపు, కేసీఆర్, కేటీఆర్, పుట్ట మధు ఫొటోలు వినియోగించకుండా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పాటలతో ఊరేగింపులు నిర్వహించడం ఏ విధమైన రాజకీయమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతల ఫొటోలు పెట్టుకోవడానికి ఎందుకు వెనుకంజ వేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో మంత్రి శ్రీధర్బాబును కలసి సన్మానించిన రవీందర్రావు ప్రస్తుతం అదే మంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శాత్రాజుపల్లిలో రూ.2 కోట్లతో సబ్స్టేషన్ పనులకు కాంట్రాక్టు ఇప్పించిన విషయాన్ని మరిచిపోయి విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
దొరల పాలన, వెట్టిచాకిరీ వంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఉపాధి హామీ పథకం నిధులపై కూడా పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి శ్రీధర్బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నూనేటి కృష్ణ హెచ్చరించారు. ప్రజా సమస్యలపై స్పందించే ముందు సామాన్య ప్రజల సమస్యలు, ఫిర్యాదులపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









Leave a Reply