వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే బాలు నాయక్
242 మంది లబ్ధిదారులకు రూ.1.12 కోట్ల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
దేవరకొండ, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
పేదలు, రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం దేవరకొండలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్ పేరు చెబితే పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, సామాజిక న్యాయం గుర్తుకు వస్తాయని అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
“వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పేదల కోసం చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయి. పేదవాడి కన్నీరు తుడవడమే నిజమైన రాజకీయమని ఆచరణలో చూపించిన మహానేత వైఎస్సార్” అని బాలు నాయక్ అన్నారు.

242 మంది లబ్ధిదారులకు రూ.1.12 కోట్ల సీఎం సహాయనిధి
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన 242 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1 కోటి 12 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బాలు నాయక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా అర్హులైన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయానికి ఎమ్మెల్యే బాలు నాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
డయాలసిస్ కేంద్రం 5 నుంచి 10 పడకలకు విస్తరణ
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఐదు పడకల సామర్థ్యంతో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని 10 పడకలకు విస్తరించినట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు.
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేవరకొండలోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సౌకర్యాన్ని విస్తరించినట్లు చెప్పారు.

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేసి అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దేవరకొండలోనే సదరం క్యాంపులు
దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం నల్లగొండకు వెళ్లాల్సిన ఇబ్బందులను తొలగిస్తూ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారానికి రెండు రోజులు సదరం క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతి సోమవారం, శుక్రవారం సదరం క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ కావాలే తప్ప ప్రజలు సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని అన్నారు.
వైఎస్సార్ ఆశయాలతో సంక్షేమానికి పెద్దపీట
దివంగత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో వైద్యం, విద్య, రహదారులు, సాగునీరు, తాగునీరు, సంక్షేమం తదితర రంగాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు మారుపాక సురేష్ గౌడ్, చింతపల్లి మండల అధ్యక్షుడు జటావత్ హరినాయక్, చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, కొండమల్లేపల్లి మండల అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఎరుకల వెంకటయ్య గౌడ్, ఊట్కూరి వేమన్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, పట్టణ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply