కొండమల్లేపల్లి పీహెచ్సీలో 10 మందికి సొంత ఖర్చులతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
కొండమల్లేపల్లి: మానవత్వానికి హద్దులు ఉండవని నిరూపిస్తూ కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ల్యాబ్ టెక్నీషియన్ వీరబాబు తన వంతు సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. తన సొంత ఖర్చులతో పీహెచ్సీలో చికిత్స పొందుతున్న పేద టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.
సోమవారం కొండమల్లేపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి చేతుల మీదుగా 10 మంది టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చే పేద టీబీ రోగుల ఆర్థిక పరిస్థితులను ప్రతిరోజూ గమనించిన వీరబాబు, వారికి తన వంతుగా సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
నూటికో కోటికో ఒక్కరు వీరబాబు లాంటి వారు
ప్రస్తుత సమాజంలో చాలామంది ‘నేను.. నాది’ అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న సమయంలో, తనకు వచ్చే జీతంలో నుంచి కొంత మొత్తాన్ని పేద రోగుల కోసం ఖర్చు చేయడం అభినందనీయమని పట్టణ ప్రజలు కొనియాడారు. న్యూట్రిషన్ కిట్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని రోగుల పరిస్థితిని కళ్లారా చూసి చలించిన వీరబాబు తనవంతు సాయం చేయడం మానవత్వానికి నిదర్శనమన్నారు.
వీరబాబును అభినందించిన డాక్టర్ ఉషారాణి
ఈ సందర్భంగా పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ.. వైద్య రంగంలో పనిచేస్తూ మానవ విలువలను చాటుతున్న వీరబాబు చిన్న ఉద్యోగంలో ఉన్నప్పటికీ పెద్ద మనసుతో సేవా కార్యక్రమం చేపట్టారని అభినందించారు. పేద టీబీ రోగులకు తన సొంత ఖర్చులతో న్యూట్రిషన్ కిట్లు అందించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
మానవ రూపంలో దేవుడిలా కనిపించారు: టీబీ రోగులు
తమను టీబీ వ్యాధి ఇబ్బంది పెడుతున్న సమయంలో, చికిత్సతో పాటు పోషకాహారం కూడా అవసరమని తెలిసినా న్యూట్రిషన్ కిట్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత తమకు లేదని కొంతమంది రోగులు తెలిపారు. తమ పరిస్థితిని గమనించి వీరబాబు న్యూట్రిషన్ కిట్లు అందించడం ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని, ఆయనను మానవ రూపంలో ఉన్న దేవుడిగా భావిస్తున్నామని కృతజ్ఞతలు తెలిపారు.
“వైద్యో నారాయణో హరి” — వార్డు సభ్యుడు బోడిగే శంకర్ గౌడ్
కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన 9వ వార్డు సభ్యుడు బోడిగే శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. “వైద్యో నారాయణో హరి” అన్నట్లుగా వైద్య రంగం సేవకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. వైద్య రంగంలో పనిచేస్తున్న వీరబాబు తనకు లభించిన అవకాశాన్ని పేదలకు సేవ చేసేందుకు ఉపయోగించుకోవడం నిజంగా గొప్ప విషయమని కొనియాడారు.
మరింత మంది దాతలు ముందుకు రావాలి: వీరబాబు
వీరబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో జీవించాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను జీతం పొందుతున్నందున, సమాజంలోని పేదల ఆరోగ్య అవసరాల కోసం తన వంతుగా కొంతైనా సహాయం చేయాలని తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే బోధించారని చెప్పారు.
తాను అందించిన న్యూట్రిషన్ కిట్లతో మరికొందరు దాతలు స్ఫూర్తి పొంది ముందుకు రావాలని, పేద టీబీ రోగులకు అవసరమైన సహాయం అందించి వారి ఆరోగ్యానికి తోడ్పడాలని కోరారు.
పేద టీబీ రోగులకు తన సొంత ఖర్చులతో న్యూట్రిషన్ కిట్లు అందించిన ల్యాబ్ టెక్నీషియన్ వీరబాబు సేవా భావాన్ని కొండమల్లేపల్లి పట్టణ ప్రజలు అభినందించారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply