బీఆర్ఎస్ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం: పువ్వాడ
జూలూరుపాడు: పోలీసు అధికారులు, సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం విధులు నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానంతో విధులు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు ప్రభావితమై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే తాము చూస్తూ ఊరుకోబోమని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లోబడి తప్పుడు చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, చట్టాన్ని గౌరవిస్తూ తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని పువ్వాడ అజయ్ కుమార్ హితవు పలికారు.









Leave a Reply