ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి: ఎస్ఎఫ్ఐ
మణుగూరు, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ మణుగూరు మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఎదుట నిర్వహించిన నిరసనల్లో భాగంగా మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మణుగూరు మండల అధ్యక్షుడు చరణ్ ప్రేమ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీఓ ఎంఎస్ నెం.97/2026లో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం లేదా విలీనం చేసే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) లేదా ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను తీసుకెళ్లే చర్యలను తక్షణమే నిలిపివేయాలని అన్నారు.
SBTETను బలోపేతం చేయాలి
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) కీలకమైన సంస్థ అని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. SBTET పరిధిలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను కొనసాగిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబొరేటరీలు, వర్క్షాప్లు, హాస్టళ్లు, భవనాలు, అవసరమైన పరికరాలు, బోధనా సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
అలాగే పాలిటెక్నిక్ విద్యార్థుల ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ అధ్యాపకులు, సిబ్బందికి ప్రత్యేక సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని కోరారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక కరిక్యులమ్ను రూపొందించడంతో పాటు విద్యార్థులు ఉన్నత విద్యలోకి వెళ్లేందుకు అవసరమైన అకడమిక్ ప్రమాణాలు, అవకాశాలను కల్పించాలని సూచించారు.
పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
జాతీయ విద్యా విధానం-2020లోని విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆరోపించిన ఎస్ఎఫ్ఐ నాయకులు.. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన జీఓ నెం.97ను వెంటనే ఉపసంహరించుకుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మణుగూరు మండల నాయకులు బి. మోహన్ కృష్ణ, ఆర్. గోపాల్, సాయి చరణ్, యశ్వంత్, రోహిత్, నీరజ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి..
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి..
ప్రైవేటీకరణను అడ్డుకోవాలి..
SBTETను బలోపేతం చేయాలి.
— ఎస్ఎఫ్ఐ మణుగూరు మండల కమిటీ










Leave a Reply