జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి
1,000 రోజుల కాంగ్రెస్ పాలనపై విద్యార్థులు, యువత మహా నిరసన
దేవరకొండలో భారీ ర్యాలీ, మహాధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయినా విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు.
విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన మహాధర్నాలో రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల విద్యకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి భారీగా నిధులు కేటాయించామని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఫీజులు అందక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు.
విద్యా రంగంపై విమర్శలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలు, గురుకులాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని రవీంద్ర కుమార్ కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో అందకపోవడంపై ఆయన విమర్శలు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. విద్యను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.
జాబ్ క్యాలెండర్పై తీవ్ర విమర్శలు
నిరుద్యోగులకు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని రవీంద్ర కుమార్ విమర్శించారు. ఖాళీలపై స్పష్టత లేని జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారని, అది “జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్లెస్ క్యాలెండర్” అని ఎద్దేవా చేశారు.
యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలతో పాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల విడుదలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
అశోక్నగర్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్ ప్రాంతాల్లోని నిరుద్యోగులతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు. ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
పోరాటం ఉధృతం చేస్తాం
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రమావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, పల్లా ప్రవీణ్ రెడ్డి, మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలి
జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి 1,000 రోజుల కాంగ్రెస్ పాలనపై విద్యార్థులు, యువత మహా నిరసన దేవరకొండలో భారీ ర్యాలీ, మహాధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయినా విద్యార్థులు, నిరుద్యోగులకు
06సెప్టెంబర్2026
06:23 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply