సాంప్రదాయ నృత్యాలకు పెరుగుతున్న ఆదరణ
చిన్నారుల్లో దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించాలి
దేవరకొండ, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే భరతనాట్యంపై చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకుని, వివిధ వేదికలపై తమ ప్రతిభను చాటుతూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న అక్కాచెల్లెళ్లు రాపోలు వాగ్దేవి, రాపోలు ఐశ్వర్య.

నల్గొండ జిల్లా హాలియా గ్రామానికి చెందిన రాపోలు రాము, శ్రావణి దంపతుల కుమార్తెలైన వాగ్దేవి, ఐశ్వర్యలు చదువుతో పాటు నృత్యంలోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. వాగ్దేవి ఆకాంక్ష పాఠశాలలో 10వ తరగతి, ఐశ్వర్య శ్రీచైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు.
చిన్నతనంలోనే నృత్యంపై వారిలో ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు డాన్స్ మాస్టర్ వద్ద శిక్షణ ఇప్పించారు. అప్పటి నుంచి భరతనాట్యం, కథక్ వంటి సాంప్రదాయ నృత్యాల్లో శిక్షణ పొందుతూ పాఠశాల స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు.
పాఠశాల వార్షికోత్సవాలు, ఆగస్టు 15, జనవరి 26తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో వీరి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చక్కటి హావభావాలు, నృత్య కదలికలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
చదువులోనూ.. నృత్యంలోనూ ప్రతిభ
చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రథమ శ్రేణిలో రాణిస్తూ తమ పాఠశాలలకు పేరు తీసుకొస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం లభించడంతో వాగ్దేవి, ఐశ్వర్యలు భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శనకు ఆలయ అధికారులు, భక్తుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు బహుమతులు కూడా అందుకున్నారు.
“ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా”తో ఆకట్టుకున్న చిన్నారులు
“ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా” పాటకు వీరు చేసిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చక్కటి కాస్ట్యూమ్స్తో సంప్రదాయ నృత్యరీతిలో చేసిన ఈ ప్రదర్శనకు సామాజిక మాధ్యమాల్లోనూ మంచి స్పందన లభించింది. యూట్యూబ్లో వేలాది మంది వీక్షకులు వీరి నృత్యాన్ని వీక్షించి ప్రశంసలు అందించారు.
కరాటే, కర్రసాము శిక్షణలోనూ ప్రతిభ
నృత్యంతో పాటు ఆత్మరక్షణ విద్యల్లోనూ ఈ అక్కాచెల్లెళ్లు శిక్షణ పొందారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో బాలికల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల్లో నెల రోజుల పాటు పాల్గొని కర్రసాము, కత్తిసాము, కరాటే తదితర ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందారు. అనంతరం నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, విద్యతో పాటు అన్ని రంగాల్లో అబ్బాయిలతో సమానంగా అవకాశాలు కల్పించాలని రాపోలు రాము, శ్రావణి దంపతులు తెలిపారు.
తమ కుమార్తెలను కేవలం ఆడపిల్లలుగా కాకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇద్దరు ఆడపిల్లలని ఎప్పుడూ ప్రత్యేకంగా భావించకుండా, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

ఉపాధ్యాయులు, డాన్స్ మాస్టర్ ప్రోత్సాహం కీలకం
పాఠశాల ఉపాధ్యాయుల బోధన, డాన్స్ మాస్టర్ శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తమ కుమార్తెలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యతో పాటు కళలు, క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
విద్యార్థినుల మనోగతం
రాపోలు వాగ్దేవి, రాపోలు ఐశ్వర్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాము భరతనాట్యంలో శిక్షణ పొంది ప్రదర్శనలు ఇస్తున్నామని తెలిపారు.
చదువు తమకు ఎంతో ముఖ్యమని, అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే భరతనాట్యం వంటి గొప్ప కళలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
ప్రస్తుతం ఫోక్ డాన్స్లు ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, తరతరాలుగా కొనసాగుతున్న భరతనాట్యం వంటి సంప్రదాయ కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని వారు పేర్కొన్నారు.
భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, తద్వారా మన దేశ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా మరింత కీర్తి పొందుతుందని వాగ్దేవి, ఐశ్వర్య ఆకాంక్షించారు.
అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…










Leave a Reply