ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం
పెద్దపల్లి జిల్లా, మంథని, ఆగస్టు 24 | అయుష్ 24 న్యూస్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టిక అల్పాహారం అందించాలనే లక్ష్యంతో మంథనిలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత సముదాయ వంటశాలను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం అల్పాహారం లేకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితి రాకుండా, వారికి పౌష్టికాహారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరమని, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 40,052 మంది విద్యార్థులకు ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వంటశాల ద్వారా పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు. భారీ స్థాయిలో ఆహారాన్ని తయారు చేసి పాఠశాలలకు సకాలంలో తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సుమారు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వంటశాలలో ఆధునిక వంట పరికరాలతో పాటు కూరగాయలను శుభ్రపరిచే, కోసే సదుపాయాలు, శుద్ధి చేసిన తాగునీరు, పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply