చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య చర్యలు
మంథని, సెప్టెంబర్ 6: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని మర్రివాడ, భిక్షేశ్వర స్వామి దేవాలయం ప్రాంతాల్లో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పరిశీలించారు. వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యుడు ఎల్లంకి వంశీధర్తో కలిసి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని సిబ్బందిని ఆదేశించారు. మురుగు కాలువలు, రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అదేవిధంగా ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, చెత్తను నిర్ణీత ప్రదేశాల్లోనే వేయడంతో పాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్మన్ కోరారు.
చైర్మన్తో కలిసి వైస్ చైర్మన్ పర్యటనపై చర్చ
మంథని మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి వివిధ వార్డుల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలోనూ, ప్రస్తుత మున్సిపాలిటీ వ్యవస్థలోనూ పాలకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించడం అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పాలకవర్గం పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యావంతుడు, యువ న్యాయవాది అయిన ముస్కుల సహేందర్ రెడ్డిని వైస్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం, ఆయన చైర్మన్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం పాలకవర్గంలో సమన్వయానికి సంకేతంగా కనిపిస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు అందించేందుకు చైర్మన్, వైస్ చైర్మన్ సమన్వయంతో ముందుకు సాగితే పట్టణ అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, మైనార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆరిఫ్, స్థానిక ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: టి. సత్యనారాయణ గౌడ్
ప్రత్యక్ష సాక్షి రిపోర్టర్ – మంథని










Leave a Reply