ప్రతి పావుగంటకో ఆర్డినరీ బస్సు అందుబాటులో ఉంచాలి: డీవైఎఫ్ఐ
మంథని: మంథని బస్టాండ్లో సరైన సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అయితే మంథని డిపోలో బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదని ఆయన అన్నారు. దీంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు గంటల తరబడి బస్టాండ్లో బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
మంథని నుంచి కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి ప్రధాన రూట్లలో ప్రతి పావుగంటకు ఒక ఆర్డినరీ బస్సు అందుబాటులో ఉంచాలని సురేష్ డిమాండ్ చేశారు. ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులుగా మార్చి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడం సరికాదన్నారు.

అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్న సామాన్యులు, మహిళలు, వృద్ధులను మధ్యలోనే దింపడం మానుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరారు. పండుగలు, ఆదివారం, సోమవారం, ఇతర రద్దీ రోజుల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి మంథని డిపోకు అదనపు బస్సులు కేటాయించాలని, ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. బస్సుల సంఖ్య పెంచడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంథని బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని గొర్రెంకల సురేష్ హెచ్చరించారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply