ఫైర్ ఇంజిన్, రైతు రెస్ట్ హౌస్ అభివృద్ధి.. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్పై తీర్మానాలు
గుంటూరు, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయంలో గురువారం చైర్మన్ కుర్రా అప్పారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పన, పరిపాలనా అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మార్కెట్ యార్డ్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు కొత్త ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రైతు రెస్ట్ హౌస్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
మార్కెట్ కమిటీకి వచ్చే ఆదాయం, వ్యయాలను సమగ్రంగా పరిశీలించి ఆర్థిక నిర్వహణను మరింత పటిష్టంగా కొనసాగించాలని నిర్ణయించారు. మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న డైలీ వేజ్ సిబ్బంది బకాయిలతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులను పరిశీలించి నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని తీర్మానించారు.
మిర్చి పంటను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి
ప్రస్తుతం హార్టికల్చర్ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంటను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో నిర్ణయించారు. మిర్చి రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా, వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే విధంగా మిర్చి పంటను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ యార్డ్లో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను మెరుగుపరుస్తూ యార్డ్ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చైర్మన్ కుర్రా అప్పారావు తెలిపారు.
ఈ సమావేశంలో యార్డ్ డైరెక్టర్లు, జీడీసీసీ చైర్మన్ వడ్రణం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply