భక్తులతో జనసంద్రంగా మారిన దేవరకొండలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయం
వందలాదిగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న వైనం

దేవరకొండ, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్:
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో జనసంద్రంగా మారింది.
భక్తులు ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాలు, కొబ్బరికాయలు, నూతన వస్త్రాలు, ఫలహారాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సంతానం, శ్రేయస్సు కలగాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గంప ప్రవీణ్ కుమార్ శర్మ, సంజీవ్ కుమార్ శర్మ వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయానికి వచ్చిన భక్తుల్లో నూతన వధూవరులు, బాలింతలు, చిన్నారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపాకటాక్షాలు తమపై ఉండాలని వేడుకున్నారు. భక్తులు తమ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply