భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల | అయుష్ 24 న్యూస్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఆగస్టు 16న పరకాల పట్టణానికి రానున్నారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పరకాల పట్టణంలోని పశువుల సంత మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.
శనివారం పరకాల పట్టణంలోని మహాదేవ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరకాల చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచేలా దాదాపు రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.
పరకాల నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనను, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పరకాల పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగా పలు కీలక అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వాటిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.45.15 కోట్లతో ఏటీసీ సెంటర్, శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధి, చలివాకు ప్రాజెక్టు నుంచి పరకాల ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం, పట్టణంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, షాదీఖానా నిర్మాణం, అక్కంపేట ఆదర్శ గ్రామం, పరకాల ఇందిరా డైరీ ప్లాంట్ భవనం మరియు యంత్రాల నిర్మాణం ఉన్నాయి.
అలాగే పరకాల–ఎర్రగట్టుగుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు, నూతన సబ్స్టేషన్, ఎన్పీడీసీఎల్ కొత్త డివిజన్ కార్యాలయం, ఎల్పీఎస్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.
పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా 100 పడకల ఆసుపత్రి, పరకాల డిగ్రీ కళాశాల, అలాగే ఆత్మకూరులో ఎన్పీడీసీఎల్ ఆధునిక డిపార్ట్మెంటల్ ఎస్పీఎం షెడ్ను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
పరకాల పట్టణంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పరకాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply