కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కుల్కచర్లలో బీఆర్ఎస్ రైతు సదస్సు, ధర్నా
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి విమర్శ
కుల్కచర్ల, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం కుల్కచర్ల చౌరస్తాలో రైతు సదస్సు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి రైతులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్రెడ్డి మాట్లాడుతూ.. “రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదు” అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజులు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
యూరియా కోసం రైతుల ఇబ్బందులు: మహేష్రెడ్డి
రైతులకు అవసరమైన యూరియా కోసం పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని మహేష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎలా అమలయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు.
రైతులకు బోనస్, మద్దతు ధర విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని, రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదని మహేష్రెడ్డి విమర్శించారు. పండించిన పంటను కొనుగోలు చేయడంలోనూ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని కొప్పుల మహేష్రెడ్డి అన్నారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply