మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని చంద్రమౌళి డిమాండ్
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి
దేవరకొండ: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల అంశంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గళం వినిపించాలని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని చంద్రమౌళి కోరారు. రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారం దేవరకొండ పట్టణంలోని మాల మహానాడు రాజగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోయిని చంద్రమౌళి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-3లోని మాల, ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ, విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించడం లేదని ఆయన ఆరోపించారు.
ఇది మాలల రాజ్యాంగబద్ధ హక్కులకు నష్టం కలిగించే పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మాలలు గత 16 నెలలుగా వివిధ కార్యక్రమాల ద్వారా పోరాటం చేస్తున్నప్పటికీ, మాల వర్గానికి చెందిన పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తగిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజు మాత్రమే మాలల సమస్యలపై మాట్లాడుతున్నారని, మిగతా ప్రజాప్రతినిధులు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని బోయిని చంద్రమౌళి కోరారు.
2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో మాలలు మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలుతో మాలలకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా పరిశీలించి, తెలంగాణలో అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానంపై పునఃపరిశీలన చేయాలని కోరారు.
రోస్టర్ పాయింట్లను సవరించి మాలలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత ఉద్యమాన్ని చేపడతామని బోయిని చంద్రమౌళి హెచ్చరించారు. ప్రభుత్వంపై పోరాటానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
మాలల సమస్యలపై అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు స్పష్టమైన వైఖరి ప్రకటించి, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు.
అయుష్ 24 న్యూస్









Leave a Reply