మతోన్మాద రాజకీయాల వల్ల దేశంలో అసమానతలు పెరుగుతున్నాయి: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు
వికారాబాద్, ఆగస్టు 30 (అయుష్ 24 న్యూస్): ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థను నిర్మూలించేందుకు, కుల వివక్షను అంతం చేసేందుకు వర్గ పోరాట దృక్పథం అవసరమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు అన్నారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కేవీపీఎస్ జిల్లా స్థాయి సామాజిక ఉద్యమ శిక్షణా తరగతుల్లో ఆదివారం ఆయన ‘కులం–వర్గం’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య ప్రిన్సిపాల్గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. వర్గ పోరాటమే సమాజ మార్పుకు చోదకశక్తిగా ఉంటుందని అన్నారు. ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా నిలబెట్టడం వల్ల పీడిత వర్గాల ఐక్యతకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. అన్ని కులాల్లోని పీడిత వర్గాలు ఐక్యంగా ఉద్యమిస్తేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
కుల సమస్యను కేవలం దళితుల సమస్యగా చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక సమస్యగా చూడాలని ఆయన అన్నారు. కుల వివక్ష, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బజరంగ్దళ్ వంటి సంస్థలు అట్టడుగు వర్గాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు చేశాయని ఆయన ప్రశ్నించారు. దేశంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, ఉపాధి హామీ పథకం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు.
ఇటీవల విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమాలు ప్రజాస్వామ్య పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని స్కైలాబ్ బాబు అన్నారు. విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం భవిష్యత్తులో కూడా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదల మధ్య కుల, మత ఘర్షణలు సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలకు ప్రజలు ప్రభావితం కాకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

కులవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాలి
కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రాయల్ నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు ఆర్. మహిపాల్ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. ఆయా పోరాటాల ద్వారా దళితుల్లో సామాజిక చైతన్యం పెరిగిందని అన్నారు.
వికారాబాద్ ప్రాంతంలో ఇప్పటికీ కులవివక్ష, అంటరానితనం కొనసాగుతున్నాయని పేర్కొంటూ, వాటికి వ్యతిరేకంగా, అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఈ శిక్షణా తరగతుల్లో లీగల్ అడ్వైజర్ వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేష్, ఆంజనేయులు, మాణిక్యం, మంజునాథ్, కమల్, లక్ష్మి, వెంకటయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, ప్రశాంత్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply