అయుష్ 24 న్యూస్ | తెలంగాణ
విముక్త జాతుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల సంచార జాతులు, పూసల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్కు, ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, సహచర మంత్రివర్గ సభ్యులకు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల తరఫున, తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జ్యోతిబా పూలే జయంతి, సర్వాయి పాపన్న జయంతి వంటి ప్రముఖుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, అత్యంత వెనుకబడిన సంచార జాతులు, అర్థసంచార జాతులకు గుర్తింపు కల్పిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 31న విముక్త జాతుల దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం మాజీ కార్యనిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మంథని నియోజకవర్గం పూసల సంఘం మరియు బీసీ ఫెడరేషన్ కులాల సమితి కన్వీనర్ కావేటి సమ్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విముక్త జాతుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం హర్షణీయమని, అభినందనీయమని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆగస్టు 31న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సంచార, అర్థసంచార జాతులకు మరింత గుర్తింపు లభిస్తుందని వారు తెలిపారు.
అదేవిధంగా బీసీ కులాల సంక్షేమం కోసం బీసీ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు.









Leave a Reply