డిఫాల్ట్కు పాల్పడిన మిల్లర్లపై కేసులు, రికవరీ చర్యలు
పెద్దపల్లి జిల్లా, మంథని, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):
మంథని మండలంలోని పవనసుత రైస్ మిల్ సీఎంఆర్ బియ్యం డిఫాల్ట్కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మంథనిలోని రావికంటి పవన్ కుమార్ యాజమాన్యంలోని పవనసుత రైస్ మిల్లుకు ఖరీఫ్, రబీ 2021-22 సీజన్లలో మొత్తం 5,798.080 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించగా, అందుకు సమానంగా 3,891.295 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.
అయితే మిల్లర్ ఇప్పటివరకు 1,069.380 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ/టీజీఎస్సీఎస్సీఎల్కు అందించారని పేర్కొన్నారు. దీంతో 2,821.915 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు తెలిపారు.
ఈ బకాయి బియ్యం 4,211.813 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానం కాగా, దాని విలువ రూ.9,82,51,492గా ఉందని కలెక్టర్ తెలిపారు. దీనికి 25 శాతం పెనాల్టీ రూ.2,45,62,873 కలిపి మొత్తం డిఫాల్ట్ మొత్తాన్ని రూ.12,28,14,365గా నిర్ధారించినట్లు వెల్లడించారు.
రబీ 2021-22కు సంబంధించి పవనసుత రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని మంథనిలోని శ్రీలక్ష్మి ఎంఆర్ఎం, సూరయ్యపల్లి మిల్లుకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పీపీసీల ద్వారా సమర్పించిన ట్రక్ చిట్టీలు, జాయింట్ సంతకాలను అధికారులు పరిశీలించినట్లు పేర్కొన్నారు. శ్రీలక్ష్మి ఎంఆర్ఎం, సూరయ్యపల్లికి చెందిన భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్ సంతకాలు ట్రక్ చిట్టీల్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం స్వీకరణ, అంగీకారానికి సంబంధించిన ట్రక్ చిట్టీల్లో నవీన్ కుమార్ సంతకాలు ఉన్న నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ మేరకు పవనసుత రైస్ మిల్ యజమాని రావికంటి పవన్ కుమార్, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం విషయంలో డిఫాల్ట్కు పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు, రికవరీతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.
📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply