సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఘన సన్మానం
హైదరాబాద్, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాజ గానసభ ప్రధాన హాలులో “స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
భారతీయ శాస్త్రీయ సంగీతం, వాద్య సంగీతం, నృత్య కళలకు వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్కు సేవా కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా సేవారత్న అవార్డును అందజేశారు. సంస్థ నిర్వాహకులు బి. నాగేంద్ర యాదవ్, కార్యక్రమ ఇన్చార్జ్ బి. దివ్యలక్ష్మి ఆయనను ఘనంగా సన్మానించి అవార్డును అందించారు.
ఈ సందర్భంగా నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. బేరి రామచందర్ యాదవ్ తన తల్లిదండ్రుల పేర్లతో బేరి వెంకటమ్మ–వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి, దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
యువత మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా క్రీడా రంగంలో అవకాశాలు కల్పించడంతో పాటు విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో బేరి రామచందర్ యాదవ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇలాంటి సేవలను గుర్తించి తమ సంస్థ తరఫున సేవారత్న అవార్డుతో సత్కరించడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం సహకరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత నోటుపుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందిస్తున్నారని తెలిపారు. యువత క్రీడల్లో రాణించేందుకు క్రికెట్, వాలీబాల్, చెస్ తదితర క్రీడా సామగ్రి, స్పోర్ట్స్ కిట్లను ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారని గుర్తుచేశారు.
అనంతరం సేవారత్న అవార్డు గ్రహీత బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ తన సేవలను గుర్తించి అవార్డు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయ కళలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో తనను సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం డైరెక్టర్ల బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటాల జంగయ్య, ప్రజాపతి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త డాక్టర్ వీర భోగావసంత రాయలు, మునుగోడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి మారమోని శ్రీశైలం యాదవ్, రాజా రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth










Leave a Reply