ఖర్గేకు సంఘీభావంగా మంథనిలో కాంగ్రెస్ నాయకుల నిరసన
మంథని, ఆగస్టు 21, అయుష్ 24 న్యూస్: హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ మంథనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు సూచనల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుదుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రు రాజమల్లు తదితరులు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవానికి విరుద్ధంగా వివక్షాపూరిత చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.
ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని అవమానించే విధంగా జరిగిన ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. కుల, మత వివక్షలకు, విద్వేషపూరిత మనస్తత్వాలకు ప్రజాస్వామ్య సమాజంలో స్థానం ఉండకూడదన్నారు.
బీజేపీకి సంబంధించిన వారే హిందువులా, ఇతర పార్టీల్లో ఉన్నవారు హిందువులు కాదా? అని నాయకులు ప్రశ్నించారు. యువతకు, సమాజానికి ఇలాంటి చర్యల ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని ప్రజలు గమనించాలని అన్నారు.
కులాలు, మతాల పేరుతో సమాజంలో విభజన సృష్టించే రాజకీయాలకు ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు నాయకత్వంలో అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, వివిధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply