నంచర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
వికారాబాద్, సెప్టెంబర్ 4 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గంలోని నంచర్ల చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ.4,000, వితంతువులకు రూ.6,000, మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
మహిళలకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి, ఇప్పుడు వారిని నిరాశకు గురిచేసిందని మహేశ్రెడ్డి విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్, రూ.13 వేల ఆర్థిక సహాయం వంటి హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ఇంట్లో ఎంత మంది వృద్ధులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని మహేశ్రెడ్డి తెలిపారు. హామీలను అమలు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని, ఎన్ని కేసులు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల సమస్యలను విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.









Leave a Reply