Breaking News
గుగులోత్ శ్రీకాంత్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఇల్లందు ఎమ్మెల్యే గౌ. శ్రీ కోరం కనకయ్య గారు

టేకులపల్లి మండలం: కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమతండా గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీకాంత్ గారు ఇటీవల స్వర్గస్తులైన సందర్భంగా, నేడు నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కోరం కనకయ్య గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కోరం సురేందర్–ఉమా గారు, టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్కినేని శ్యామ్ గారు, కోయగూడెం సర్పంచ్ శ్రీ కోరం సుభాష్ చంద్రబోస్ గారు, పెగల్లపాడు సర్పంచ్ శ్రీ కోరం హనుమంతు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

– AYUSH 24 NEWS
“The Voice of Truth”

🚨 AYUSH 24 NEWS | వాతావరణ హెచ్చరిక 🚨

రానున్న 3–4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం – ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రానున్న 3–4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి.

తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:

🔹 అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లండి.
🔹 వాగులు, వంకలు, చెరువులు, కాలువలు మరియు వరద నీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దు.
🔹 తెగిపడిన విద్యుత్ తీగలు లేదా తడిసిన విద్యుత్ స్తంభాలు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వండి.
🔹 చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
🔹 స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ శాఖ మరియు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించండి.
🔹 అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.

మీ భద్రతే మీ కుటుంబానికి అతిపెద్ద రక్షణ.

అప్రమత్తంగా ఉండండి… సురక్షితంగా ఉండండి. 🙏

– AYUSH 24 NEWS
“The Voice of Truth”

తోగూడెం అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సేవాలాల్ సేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి – జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27: పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై తక్షణమే సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ (IDOC)ను ముట్టడించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ, గతంలో 29-06-2026న ఇదే అంశంపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

తోగూడెంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, గిరిజనుల హక్కులు ఉల్లంఘించబడటంతో పాటు సహజ వనరులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు.

జిల్లా మైనింగ్ శాఖ అధికారులు తోగూడెం ప్రాంతంలోని క్వారీలను ఇప్పటికే మూడుసార్లు సీజ్ చేసినట్లు ప్రకటించడం ద్వారా అక్రమ మైనింగ్ జరిగిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. అయితే తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేసి మళ్లీ అక్రమ తవ్వకాలకు అవకాశం కల్పించడం వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా తవ్విన ఖనిజ పరిమాణాన్ని తక్కువగా నమోదు చేసి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని తగ్గించడం ద్వారా ప్రజాధనానికి భారీ నష్టం కలిగించారని ఆరోపించారు. అలాగే సమాచార హక్కు చట్టం (RTI) కింద కోరిన వివరాల్లో వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ దీనిపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పర్యావరణ అనుమతులు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) మార్గదర్శకాలు మరియు ఇతర చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమ మైనింగ్ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల పాత్రను కూడా దర్యాప్తు చేయాలని, అక్రమ మైనింగ్ నిర్వహించిన వారితో పాటు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, ఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్, ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్, బట్టు హుస్సేన్ నాయక్, గోర్ బంజారా పోరాట సమితి నాయకులు, గిరిజన ప్రతినిధులు, మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహణ

అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన క్రీడాకారులు, సభ్యులు

దేవరకొండ, జూలై 26 (AYUSH 24 NEWS):
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి.టి. (NVT) మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత సైన్యం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన 527 మంది వీర జవాన్లను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.

పాకిస్థాన్ సైనికులు లద్దాఖ్‌లోని కార్గిల్ పర్వత శిఖరాలను ఆక్రమించగా, వారిని తరిమికొట్టేందుకు భారత సైన్యం చేపట్టిన సాహసోపేతమైన సైనిక చర్యలో మంచుతో కప్పబడిన క్లిష్టమైన కొండల్లో సుమారు రెండు నెలల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి విజయాన్ని సాధించారని తెలిపారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను యువత ఆదర్శంగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, పి.జె. శాంసన్, భాస్కర్ రెడ్డి, వల్లమళ్ల ఆంజనేయులు, తాళ్ల సురేష్, జగదీశ్వరాచారి, సైదులు, నాగు, సంజీవ, రాజు, కుమార్, అంజి, వాసుదేవుడు, నాగార్జున, అభిరామ్, చరణ్, వంశీ తదితరులు, క్రీడాకారులు మరియు కళాకారులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

— AYUSH 24 NEWS | The Voice of Truth