పట్టణంలో వందకు పైగా వినాయక మండపాలు.. ఏర్పాట్లలో నిర్వాహకులు
దేవరకొండ, సెప్టెంబర్ 13 — అయుష్ 24 న్యూస్:
ఆది గురువు, విఘ్నేశ్వరుడి పూజతో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వినాయక చవితి పండుగకు దేవరకొండ పట్టణంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని 20 వార్డుల్లో వందకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు మండపాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
విఘ్నాలను తొలగించి విద్య, జ్ఞానం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలను ప్రసాదించే బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
వినాయక చవితి అంటే చిన్నారుల్లో ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. ఇప్పటికే పలు మండపాల వద్ద యువత భజనలు, కీర్తనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండపం వద్ద భక్తి వాతావరణం నెలకొనేలా నిర్వాహకులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి
వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ అలంకరణలు, షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే గాలి, వర్షం వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తులు, నిర్వాహకులు సమన్వయంతో నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
— అయుష్ 24 న్యూస్



Musini.Anjan





Leave a Reply