మెగాస్టార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు
హైదరాబాద్, అయుష్ 24 న్యూస్: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆదివారం రాత్రి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్లను తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాదవరాయుడుపాలెం తాజా మాజీ సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా సత్కరించారు.

కడియం ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన భారీ గజమాలతో చిరంజీవిని అభిమానులు ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ సమయంలో జరిగిన పలు విషయాలను చిరంజీవి, చంటి గుర్తు చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చంటికి రాజమహేంద్రవరం రూరల్ టికెట్ దాదాపుగా ఖరారైనప్పటికీ చివరి సమయంలో అవకాశం చేజారిన విషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
తమ స్వగ్రామానికి ఒకసారి రావాలని అన్నందేవుల చంటి ఈ సందర్భంగా చిరంజీవిని కోరారు. తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన వరికంకుల కుచ్చును చిరంజీవికి అందజేశారు.
చంటి చేపడుతున్న ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర స్థాయిలో లభించిన గుర్తింపు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చంటి అందుకున్న అవార్డు వివరాలను చిరంజీవి ఆసక్తిగా పరిశీలించారు.
అన్నందేవుల చంటి, ఆయన తనయుడు అన్నందేవుల మణీంద్రలు జిల్లా నుంచి వచ్చిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్, రాజా రవీంద్ర, చలమలశెట్టి సునీల్, గోపీ సోదరులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులతో సుమారు అరగంట పాటు ఆప్యాయంగా గడిపారు.
ఈ కార్యక్రమంలో జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ పాలపర్తి ప్రకాష్, కడియపులంక సొసైటీ మాజీ అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీను, మెగా ఇంజనీరింగ్ సంస్థ జనరల్ మేనేజర్ అన్నందేవుల సతీష్, ఎన్నారై నామన హరికృష్ణ, ఉండమట్ల దుర్గాప్రసాద్, కసిరెడ్డి కేశవ, అన్నందేవుల పెద్దబాబు, యార్లగడ్డ నాగన్న తదితరులు పాల్గొన్నారు.
చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొన్నారు.
అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…










Leave a Reply