త్వరలోనే ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపిస్తాం
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం, ఆశీల్మెట్ట జంక్షన్, సెప్టెంబర్ 12 — అయుష్ 24 న్యూస్:
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని విశాఖపట్నం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు పెన్షన్, ఆరోగ్య భద్రత, ఇతర సంక్షేమ అంశాల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వినాయక చవితిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వేమన మందిరంలో జర్నలిస్టుల వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 700 మంది జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పూలు, పండ్ల మొక్కలు, స్వీట్లు పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ మంచి కార్యక్రమమని, పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని పేర్కొన్న ఆయన.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సిఎన్ఆర్ సంస్థల గ్రూప్ అధినేత చెల్లుబోయిన నర్సింగరావు మాట్లాడుతూ.. సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన పరిధి మేరకు సహాయం అందిస్తానని తెలిపారు.
తాను పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఎంతోమంది సహకరించారని, వారిలో పలువురు జర్నలిస్టులు కూడా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఇతరులకు సహాయంగా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
సమావేశానికి అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టుల సంఘం (NAJ) కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టుల ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకాలు, పూలు, పండ్ల మొక్కలు, స్వీట్లు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ, సంప్రదాయ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి నగరంలోని వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ జనసేన పార్టీ నాయకులు కోట్ల రఘు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ, కార్యదర్శి జి. శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, సీనియర్ పాత్రికేయులు ఎమ్మెస్సార్ ప్రసాద్, స్వాతి ప్రమోటర్స్ ప్రతినిధి చక్రవర్తి, ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ జిల్లా నాయకులు బి. ఆనందరావు, బండారు శివప్రసాద్, రామకృష్ణ, బొబ్బర ప్రసాద్, పి. నగేష్ బాబు, హరి, రాజశేఖర్, జగన్నాథ శర్మ, గణేష్, రవి శంకర్, హరనాథ్, ప్రసాద్, పద్మనాభం సత్యనారాయణ, రంగధామం, డి.ఎన్.ఎస్. సాయి తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్









Leave a Reply