లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకల గోడపత్రికల ఆవిష్కరణ
జూలూరుపాడు: ఆగస్టు 9న చుంచుపల్లి తండా వేదికగా నిర్వహించనున్న ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకల సందర్భంగా, స్థానిక జూలూరుపాడు మండలం బెతలపాడు, పీక్లా తండాలో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఆధ్వర్యంలో గోడపత్రికలను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి న్యాయవాది, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి జిల్లా నాయకులు గూగులోతు రాందాస్ నాయక్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ, ఆగస్టు 9న జరిగే ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలకు లంబాడీలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనుల రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, పెసా చట్టం, 1/70 చట్టం సమర్థవంతమైన అమలు, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని కోరారు.

అలాగే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ క్లాజ్ (2), పేరా 5(1) ప్రకారం గవర్నర్, రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక విచక్షణాధికారాలను వినియోగించి ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై 112వ గిరిజన సలహా మండలి (TAC) సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు.
నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే డీఎస్సీ, ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఖాళీల భర్తీ కోసం ప్రత్యేకంగా “స్పెషల్ డీఎస్సీ (Special DSC)” నిర్వహించాలని ప్రభుత్వాలను కోరారు.
అదేవిధంగా, రద్దయిన జి.ఓ. నెం.3 స్థానంలో చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ జి.ఓ. విడుదల చేసి, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన హక్కులను, రాజ్యాంగబద్ధమైన చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ జిల్లా నాయకులు మంగీలాల్ నాయక్, మోహన్ నాయక్, తండా నాయక్ హార్సింగ్ నాయక్, కార్ భారీ బిచ్చునాయక్, లక్ష్మణ్ నాయక్, సుగుణ రావు, కిషన్ నాయక్, రమేష్, వెంకటి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
— AYUSH 24 NEWS

