🌾 రైతుల సంక్షేమమే లక్ష్యం – విత్తన మేళా–2026ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య
AYUSH24 NEWS | ఇల్లందు ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న “విత్తన మేళా–2026” కార్యక్రమాన్ని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య గారు నేడు ముత్యాలంపాడు X రోడ్డు రైతు వేదిక వద్ద ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి విత్తన మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు, వివిధ రకాల నాణ్యమైన విత్తనాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వ్యవసాయ శాఖ అధికారులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విధానాల్లో మార్పులు చేసుకుంటే రైతులు నష్టాలను తగ్గించుకుని మెరుగైన దిగుబడులు సాధించగలరని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు, ఆధునిక మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి విత్తన మేళాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ తమ భూములకు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు గారు, సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) లాల్ చంద్ గారు, వ్యవసాయ అధికారి (AO) అన్నపూర్ణ గారు, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), ముత్యాలంపాడు X రోడ్డు సర్పంచ్ బానోత్ పూల బంతి గారు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌾 AYUSH24 NEWS సందేశం
“వ్యవసాయం దేశానికి వెన్నెముక… నాణ్యమైన విత్తనం రైతు విజయానికి తొలి అడుగు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, ప్రభుత్వ సూచనలు పాటిస్తే రైతుల భవిష్యత్ మరింత సస్యశ్యామలం అవుతుంది.”

