Breaking News
టేకులపల్లి మండల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, జూలై 29 (AYUSH 24 NEWS):
టేకులపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కోరం కనకయ్య హాజరై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, వివిధ దశల్లో ఉన్న గృహాల పనులు, పునాదుల స్థాయి నుంచి పైకప్పు వరకు నిర్మాణాల ప్రగతి, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలు, నిధుల వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పనులు ఆలస్యంగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఇళ్లను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.

అదేవిధంగా మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీదేవి, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) తిరుపతి, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH 24 NEWS | ప్రజల గొంతుక – నిజాల ప్రతిధ్వని

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్‌కు ఘన జన్మదిన వేడుకలు

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ (Hyderabad Circle) ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరవనీయులు ఆంజనేయ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలను హైదరాబాద్ కోటిలోని LHO ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో SBISUHC, SBI SC/ST Employees Welfare Association, OBC Employees Welfare Association అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్, కామ్రేడ్స్ మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంజనేయ ప్రసాద్ గారితో కేక్ కట్ చేయించి, శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆంజనేయ ప్రసాద్ గారిని అభినందించారు.

– AYUSH24 NEWS | నిజానికి స్వరం